10, అక్టోబర్ 2014, శుక్రవారం

రాజు గారి వేట వ్యసనం !!


నందన రాజ్యాన్ని నందుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండే వాడు. అతనికి వేట ఒక వ్యసనంగా మారింది. వేట నందుడికి ఎంత వ్యసనంగా మారిందంటే, రాజకార్యాలేవీ పట్టించు కోనంత ! ఏడాది పొడుగునా వేట కోసం మందీ మార్బలంతో అడవిలో విడిది చేసే వాడు. పరిపాలనను గాలి కొదిలీసేడు.
    రాజు గారి వేటంటే మాటలా ! అందమైన గుడారాలు, చవులూరించే వంటలు యారు చేయడానికి వంట వాళ్ళూ, రాజు గారిని ఉల్లాస పరిచేందుకు నాట్యకత్తెలు, సంగీత వాద్య కళాకారులు, విదూషకులూ, వందిమాగధులూ ... వాహ్ !
ఒకరేమిటి ! రాజు గారి వెంట అడవికి రాచ నగరంతా తరలి వెళ్ళేది. నందుడికి రాజ వైభవాలన్నీ అడవిలోనే అమరి పోయేవి ! ఇంకేం ! రాజ పాలన కుంటు పడింది. అస్సలు పట్టించు కోవడమే మానేసాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు. సామాన్య  ప్రజలు నానా అవస్థలూ పడే వారు.
     ఇలా ఉండగా, ఒక రోజు అడవిలో  వేటాడుతూ ,నందుడు దారి తప్పి పోయేడు. అతని పరివారమంతా బాగా వెనుకబడి పోయింది. రాజు ఒంటరిగా కీకారణ్యంలో చిక్కుకు పోయేడు ! చాలా దూరం నడచి నడచీ బాగా అలసి పోయేడు. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దాహంతో నాలుక పిడచ కట్టుకు పోయింది. చిత్రంగా అడవి చెట్లన్నీ మ్రోడు వారి పోయాయి ! అడవి నందుడి కంటికి ఎడారిలా కనిపించ సాగింది ! ఎక్కడా తిండీ, నీరూ దొరికే సూచనలు లేవు. అలసట వల్ల నిద్ర ముంచు కొస్తోంది. రాజుకి దు:ఖం వచ్చింది. ఏడు పొక్కటే తరవాయి !
     ‘‘ దేవా ! గుక్కెడు నీళ్ళూ , పిడికెడు అన్నమూ ఇప్పించవయ్యా ! సుఖంగా నిద్ర పోయేందుకు సురక్షితమైన చోటు చూపించవయ్యా !’’ అని, గుర్తొచ్చిన దేవుళ్ళనందరినీ వేడు కున్నాడు.
    అడివంతా కలియ తిరిగాడు. రాజుకి మతి పోయింది. పచ్చగా ఉండే అడవంతా ఇప్పుడు వెలవెలబారి పోయి ఉంది. విరగ కాసే పళ్ళ చెట్లకు ఒక్క పండూ  కనిపించడం లేదు. రాజుకి ఆందోళన ఎక్కు వయింది . పిచ్చెత్తినట్టు అడవంతా తిరిగాడు. ఒకే ఒక్క చోట, ఒక చెట్టుకి ఒకే ఒక్క పండు కనిపించింది!
 రాజుకి ప్రాణం లేచొచ్చినట్టయింది. దానిని కోసుకుని తినబోయాడు. అంతలో
ఆ చెట్టు కింద కూర్చుని ఒక కుర్రాడు ఆకలికి ఏడుస్తూ కనిపించాడు. రాజుకి వాడిని చూసి జాలి వేసింది. ఆకలి బాధ చల్లార్చు కోవడం కోసం నోట పెట్టుకో బోతున్నఆ ఒక్క  పండుని వాడికి ఇచ్చేసాడు. వాడు ఆ పండు తిన్నాడో, లేదో, వెంటనే మాయమై పోయాడు ! రాజు ఆశ్చర్యానికి అంతు లేదు ! అంత లోనే అడవిలో చెట్లన్నీ మునుపటి లాగే పళ్ళతో కళకళలాడుతూ కనిపించాయి. కావలసిన పళ్ళని  కోసుకుని తిందామని రాజు అనుకుంటూ ఉండేంతలో విపరీత మయిన మంచు తుఫాను కురిసింది.  రాజు మంచులో తడిసి ముద్దయి పోయాడు, చలికి వణికి పోసాగేడు. ఒంతలో, ఒక ముసిలామె ఒక చెట్టు కింద చలికి వణికి పోతూ అతని కంట పడింది. రాజు జాలితో ఆమెకు తన ఒంటి మీద బట్ట తీసి ఇచ్చేడు. అంతే ! ఆమె వాటిని అందుకుందో, లేదో, అంత మంచు తుఫానూ మాయమై పోయింది. మళ్ళీ అడివంతా ఎప్పటి లాగే ప్రశాంతంగా ఉంది ! రాజు ఈ సారి మరింతగా ఆశ్చర్య పోయాడు. ఈ వింత మార్పులకి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ముందుకి నడిచాడు ఇంతలో. అడవిలో ఒక్క సారిగా దావాలం చెలరేగింది.  ఆ మంటల్లో ఒక కుందేలు చిక్కుకు పోయి, వివిలాడుతూ ఉండడం రాజు కంట పడింది. ఏ మాత్రం ఆలోచించ కుండా, రాజు  దయతో దానిని కాపాడి, అడవిలో వదిలేసాడు.
    అప్పుడు రాజుతో ఆకాశ వాణి ఇలా అంది : ‘‘ ఓ రాజా ! నీ వేట వ్యసనం వల్ల అడవి లోని జంతు జాలం నానాటికీ తగ్గిపోతోంది . నీ వల్ల, నీ పరివారం వల్ల అడివంతా నాశనమై పోతోంది. నీకిది తగదు సుమా !  అయితే, ఒక విషయం ! నువ్వు ఆకలితో ఏడుస్తున్న బాలుడికి , చలికి వణికి పోతున్న వృద్ధురాలికి, సాయం చేస్తున్నప్పుడు నీకు నీ ఆకలి దప్పులు కానీ, చలి బాధ కానీ గుర్తుకు రాలేదు ! అంటే, నువ్వు నీ రాజ ధర్మాన్ని పూర్తిగా మరచి పో లేదన్న మాట ! అలాగే. చేతికి చిక్కిన కుందేలుని కాపాడి వదిలి పెట్టావంటే, నీ వేట వ్యసనం నిన్ను ఇంకా పూర్తిగా నిర్దయుడిగా చేయ లేదన్నమాట.  నీలో ఇంకా రాజధర్మం, మానవత్వం మిగిలే ఉన్నాయి. ఒక్క నీ వేట వ్యసనం వల్ల నీకూ, నీ ప్రజలకీ అనర్ధం జరుగుతోంది. దానికి ప్రతీకగానే అడవిలో  పచ్చని చెట్లన్నీ అకస్మాత్తుగా మ్రోడు వారి పోవడం, మంచు తుఫాను కురియడం, దావానలం వ్యాపించడం మొదలైనవి జరిగాయి. ఈ విపరీతాలన్నీ నీకు కను విప్పు కలిగించడం కోసం
వన దేవత సృష్టించినవే ! అందు చేత, నువ్వు ఇక నయినా ఈ వేట వ్యసనాన్ని తగ్గించుకుని, నీ ప్రజలను చక్కగాపరిపాలించు ! నీ రాజ్యం లోని ప్రజల ఇక్కట్లు తొలిగించు. అది నీ ధర్మం ! ’’ అంది.      రాజుకి కనువిప్పు కలిగింది. ఇంతలో పరివారమంతా వెతుక్కుంటూ వచ్చి, రాజుని చేరారు.    ఆ నాటి నుండి, క్షత్రియ ధర్మంగా ఎప్పుడో తప్ప రాజు వేటకు రావడం లేదు.    అప్పటి నుండి నందుడి రాజ్యం సుభిక్ష మయింది !! సామాన్య ప్రజల సంతోషం ఇంతా అంతా కాదు!!

కామెంట్‌లు లేవు: